
నా! దేవర్షి గణ సంఘస్తూయమానాత్మ వైభవా ! భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా !సంపత్కరీ సమారూఢా సింధుర వ్రజ సేవితా ! అశ్వా రూఢ అధిష్ఠితాశ్వ కోటికోటిభిః ఆవృతా !!
దేవర్షి గణాలు ( బ్రహ్మ, ఇంద్రుడు, నారదాది దేవర్షులు, వశిష్టాది మహర్షులు, ఆదిత్యుడు మొదలైన కాల నిర్దేశం చేసే ద్వాదశాదిత్యులు గణాలు – ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అష్ట దిక్పాలకులూ ) కీర్తించే వైభవ ( అన్ని వైపులా వెలిగే )ఆత్మ రూపమైన ( అఖిలానుగత, అఖిల పరిచితమైన, సచ్చిదానంద రూప మైన చైతన్య స్వరూపం – consciousness of physical body ( a downward knowledge that turns into bondage – taken in christian bible with adam and eve but not understood the upwardmovement of knowledge and failed know the energy factor that is influencing behind the very existence ) and its identity of eternal entity – (అగ్నిపురాణం ) ఆ లలిత. భండాసురుడు ( మూడు లోకాలు అంటే మూలాధార అనాహత ఆజ్ఞల స్థాయిలను శాసించగల అరిషడ్వర్గా లకు అధిపతి అయిన ఇంద్రుని అతని అష్ట దిక్పాలకులను, దైవీయ శక్తులను జయించిన అసురుడు లేక అసుర ప్రవృత్తి )మొదలైన అసుర సంహారం చేయడానికి తన (మానవీయ, దైవీయ, ఆధ్యాత్మిక శక్తులు ) శక్తి సేనల సమూహంతో ( ఒక్కటే అయిన శక్తి అనేక గా అంటే కాళి, సరస్వతి, నవ దుర్గలు, చండి, బాల, లక్ష్మి రూపాలై) వస్తున్నది. లలితోపాఖ్యానం లో వివరించినట్లు భండాసురుడు రుద్రుని క్రోధం నుండి జన్మించి రౌద్రం తో ఉంటాడు. కామ దహనంతో అక్కడ అసుర శక్తులను దహనం గావించి అక్కడ విఘ్నాలను కలిగించే ఈశ్వరుడు ఇక్కడ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు గా ఉదయిస్తాడు).
లలిత జీవి శరీరంలో ఆత్మగా ప్రవెశించి జ్ఞాన ధర్మ కర్మ పరిణామం చెంది సమతుల్య సంకల్ప స్థిర స్థితి చైతన్య శక్తి అయిన శ్రీ లలితగా లేక పరమాత్మగా తన స్వీయ స్థితిగా ( తంత్రరాజం ) రూపొందుతున్నది. ఈ శరీరంలో ఉన్న శక్తి సచ్చిదానంద రూపమైనా ( existence, consciousness and bliss ) జాగృతం కాని శక్తి అరిషడ్వర్గాల కు లోనైన భండాసురునిగా అతని సేనలుగా మారుతున్నది. అంతే గాక యుగాల వృత్తిని బట్టి అనేక అజ్ఞాన అసుర రూపాల ఉత్పత్తికి జ్ఞానంతో వారిని వధించడానికి వివిధ దేవీ రూపాలను సంతరించుకొంటున్నది. అసు ఆంటే జీవితాన్ని ర నాశనం చేసేవాడు ఆని అర్థం. శివ సూత్రాలలో చెప్పినట్లు జ్ఞానాన్ని తన స్వస్వరూప స్థితికి కాకుండా బంధానికి మాయకు కలిపేవాడు అసురుడు లేక అనవమల స్వరూపుడు. అదే సూత్రాలలోశివుడు భైరవుడు గా ఉదయించి శక్తితో కూడి మాయా ప్రపంచ పదార్థ నిర్మాణం చేస్తున్నారు ఆని చెప్తున్నది. చైతన్య శక్తి స్థిరత్వం కొరకు పదార్థ రూపాంతరం చెంది అధోముఖమైన భౌతిక ప్రపంచం ( తిరోగమన పరిణామం ) ,శక్తి మనస్సులో జాగృతమైనప్పుడు మానవుడు, ఊర్ధ్వ ముఖమై స్వస్వరూప సిద్ధితో ( పురోగమన పరిణామం )సత్ చిత్ ఆనంద రూపమైన శ్రీ లలిత ఉదయిస్తున్నది. శక్తి పంచ భూత సమన్వితమైన జీవాసుర మానవ శరీరాన్ని ఆశ్రయించి మానవ జ్ఞాన సాధనలతో మాయ నుండి బయటపడి దివ్య ఆధ్యాత్మిక శక్తిగా మారుతున్నది. శివ సూత్రాల వ్యాఖ్యానంలో వార్తిక కారులు ఈ ఊర్ధ్వ ప్రయాణానికి ముఖ్య కారణం ప్రకాశ శక్తిలో అంతర్లీనమైన విమర్శ శక్తి తన స్వరూప జ్ఞానం కోసం చేసే ప్రయత్నం గా చెప్తున్నారు. ప్రపంచంగా ఉద్యమించి పూర్ణాహంభావం చేరుకొని తన స్వస్వరూపాన్ని గుర్తించే ప్రతిభగా మారుతున్నది.
దేవగణాలతో కూడిన ఆత్మ స్వరూపం కలదై ఆ లలిత భండాసురుణ్ణి సేనా సమేతముగా వధించడానికి పూనుకొన్నది. మంత్రిణీ శక్తి సమేతురాలై భండ పుత్రులను సంహరించడానికి పరాక్రమ వంతురాలైన బాల ఉద్యమించింది. శివ సూత్రాలలో చెప్పిన మరో విషయం చిత్ శక్తి తో ఇఛ్ఛగా కలిసి భైరవుడు మానవ రూపధారణ చేస్తున్నాడని చెప్తున్నది. సృష్టి లేక పదార్థ రూపాంతరం ప్రారంభమైనప్పుడు శక్తి అగ్ని రూపంగా ఉండి తానే కాలంగా ఉంటుంది. అందుకే సంవిత్తుగా గా ఉన్న ఆ అగ్ని కాలాగ్ని అవుతున్నది. పరిణామం లేని అగ్నిగా ఉన్నంత వరకు అక్కడ కాలం స్థిరంగా ఉంటుంది. ఆంటే స్థిర స్థితి చైతన్య శక్తుల సమతుల్యతా స్థితిలో లేక శక్తి కాంతి, అగ్ని, నాదం గా ఉన్నంతకాలం వరకు అది స్థిరంగా ఉంటున్నది . సమాధి స్థితిలో కూడా ఆ యా సాధకులకు కాలం స్తంభించి మార్పు లేకుండా చేస్తుంది. ఎందుకంటె బుద్ధి, ప్రాణం అంతర్లీనమైన ఆ శక్తి స్థాయిలో రూపాంతరం లేక కాలం నిలిచి ఉంటుంది. బాలునిలో ప్రపంచ జ్ఞానం మరుగున ఉన్నట్లు సాధన చేసే వారికి ఆయా స్థాయిలలో శక్తులు ప్రేరణ పొంది ఉదయిస్తున్నాయి.
ఆ లలిత సంపత్కరీ ( మూడు బీజాక్షరాలు కలిగిన మంత్రాధి దేవత )లేక సంపదలను పెంచే (ఏకంగా ఉన్న చిత్ లో లేక జీవ బుద్ధిలో జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ) రూపంతో ఉదయించి అనేక గజ సేనలు ( సింధుర ) సేవిస్తుండగా ( the triad is the knower, knowledge and to be known), ‘అశ్వారూఢ’ ( పదమూడు బీజాక్షరాలతో జాగృతమయ్యే యోగినీ దేవత )రూపంలో కోట్లకొద్దీ అశ్వ సేనలను ( నిరంతరం మానవ శరీరంలో ప్రతి అవయవం నుండి వచ్చే ఇచ్చా రూప కోరికలు ) అదుపు చేస్తూ, సైన్యం తో యుద్ధ సన్నద్ధమైంది. ఇక్కడ ఈ యోగినీ శక్తులు జాగృతమైతే మదపుటేనుగుల వంటి అరిషడ్వార్గాల విజృంభణ, అనేక కోట్ల నాడీ ప్రేరకాలకు కారణం అవుతాయి. ఆశక్తులు సాధన చేయని వారిలో నిద్రాణమై ఉంటాయి. సాధకుడు వాటిని మేల్కొల్పగానే అవి తన చిత్ లేక బుద్ధి ఏర్పర్చిన మాయా స్వరూపాలుగా తెలుసుకొని స్వస్వరూప ఆత్మ దర్శనం చేస్తాడు. ఈ అశ్వారూఢ అపరాజిత నామంతో లలితా దేవి పాశం నుండి అత్యంత వేగంగా బయలుదేరుతున్నది ( ఉఛ్వ్వాస నిశ్వాస ల తో కూడిన ప్రాణం ) ఆని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. ఆంటే శ్వాస ఎక్కువగా ఉన్న పశు, అసుర, సాధారణ మానవులలో దీర్ఘ శ్వాసతో చైతన్యం మందగించి ఉంటుంది. అదే యోగ, మంత్ర సాధనలతో అది హ్రస్వమై చైతన్యం పెరుగుతూ వస్తుంది. కేవల కుంభకంలో శ్వాస పూర్తిగా స్థంభించినప్పుడు చైతన్య స్వరూపుడైన జీవుడు బుద్ధిని నిలిపి సమాధి చేరతాడు. మూలాధారంలో అసంకల్పిత సమతుల్య దశలలో అనాహతం వరకు అసంకల్పిత సంకల్పిత మధ్య స్థాయిలో చైతన్య సమతుల్య స్థితి శక్తి, ప్రాణ, బుద్ధి క్రమంలోనూ, అనాహతం నుండి ఆజ్ఞ వరకు జ్ఞాన సంకల్పాలు అధికమై ఆ స్థితి చైతన్య సమతుల్యం శక్తి బుద్ధిని ఆత్మలో కేంద్రీకరించి ఆజ్ఞ నుండి సహస్రారం పైన లలిత శ్రీ లలితగా ( పూర్ణ సంకల్ప సమతుల్య స్థితి చైతన్య జ్ఞాన స్థిర శక్తి ) మారుతూ బుద్ధిని సంకల్పంతో కలిపి చైతన్య శక్తిని,దాని అధీనంలో ఉన్న ప్రాణాన్ని సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియ జీవ క్రియలను తన ఆధీనంలోనికి తెచ్చుకొని తన స్వస్వరూపమైన కేవల రూపంగా ఉంటుంది. ఈ స్థాయి స్థిరమై తానే అనంత శక్తిగా సంకల్పంతో విశ్వ విహారం చేస్తుంది. కాది మాత లో ఆరూఢ ఆంటే ఇంద్రియాలు అనే అశ్వాలను అధిరోహించిన సంకల్పిత బుద్ధి శక్తి కలిగిన స్వమతుల్య యోగినీ శక్తి ఆని చెప్తున్నది. ఇది జాగృతమైతే సమస్త ఇంద్రియాలు వాటి ప్రభావం కలిగిన జీవ చర్యలు అధీనం అవుతాయి. తన బుద్ధిని సంకల్పంతో శాసించ గలిగినవారు తమకంటే క్రింద పరిణామ స్థాయిలో ఉన్న అన్ని జీవులు, మానవులలోని బుద్ధిని తమ ఇచ్ఛా జ్ఞాన క్రియలతో శాసిస్తారు. ఇదే సమాజంలో వ్యక్తులు వివిధ స్థాయిలలో ఉండడానికి కారణం. అందరూ యోగ సాధన చేస్తున్నారా ఆంటే కొంతమంది జన్మ సిద్ధమై ఉన్న బుద్ధి కుశలత కలిగి ఇఛ్ఛా జ్ఞాన క్రియలను కాలానుగుణంగా సమతుల్య సమన్వయం చేసి తమ క్రింది వారిపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఇది కొంతమందిలో సాధన, వయసుతో సంబంధం లేకుండా జన్మ సిద్ధిలో జరుగుతున్నది. ఈ స్ధాయిని బాహ్య ప్రపంచానికి ఉపయోగించి కామవాసనలతో కర్మ బద్ధులై వాటి శక్తిని క్రమంగా కోల్పోతారు. అంతర్ముఖం చేస్తే అవి తమ పూర్ణ స్ధాయిని చేరుకొంటాయి. దీనిని ఉద్యమ శక్తి లేక విస్మయో యోగ భూమిక ( ఆంటే ఆశ్చర్య ఉత్సాహాలతో కూడిన చైతన్య స్థితి ) ఆని కూడా అంటారు. ఆశ్చర్య ఆంటే తను ఇంతకు ముందు చూడని శక్తులను, స్వస్వరూపంలో వృద్ధిని చూస్తూ ప్రతినిముషం ఉత్తేజం పొందుతూ ఉంటాడు. ఇచ్ఛా శక్తిని పెళ్లి కాని ఉమా గా పిలుస్తారు. అదే శివ సూత్రాల వివరణ లో ఈ విస్మయ ఉత్తేజ శక్తి అవివాహిత అయిన ఉమ లేక కుమారి సదాశివుని పూర్ణ రూపంలో ఆంటే స్థితి చైతన్యాల సమతుల్య సంకల్పంతో కలిసి పరాభట్టారికగా మారడానికి సిద్ధమవుతున్నది. వీరిద్దరి కలయిక తో మొదట అసంకల్పితంగా 36 తత్వాలతో కూడిన సృష్టి ని జయించి శ్రీ లలితగా మారుతున్నది. కు ఆంటే ఆధారాన్ని మార్యతే నాశనం చేసేది కౌమారి ఆని అర్థం. కౌమారి గా పరిసరజ్ఞానంతో విశ్వ విహారం చేస్తూ జీవితం క్రీడ గా కాలం గడుపుతుంది. కుమారి గా ప్రపంచం నేర్చుకొంటూనే ఎటువంటి సృష్టి క్రియా కలాపాలకు లోను కాకుండా పూర్ణ స్వచ్ఛత ను కలిగి ఉంటుంది. ఈ యోగిని అధీనంలో ఉన్నవారు కామ కలాపాలకు దూరమైన సాధకులుగా ఆజన్మ బ్రహ్మచర్యం అవలంబించి అనుత్తరదేశికులుగా మారతారు. ఈ స్థితిలో సాధకుడు తన శరీరమే సదాశివుడుగా ఉన్న భావం కలుగుతుంది. శివ సూత్రాలలో చెప్పినట్లు ఈ స్థాయి యోగులకు” యథా తత్ర తథా అన్యత్ర ” అనే శక్తి కలిగి తమ భావాన్ని ( ఆలోచనలను ) అనుభవాలను ( శక్తి చాలనాన్ని ) ఇతరులలో ప్రవేశ పెట్టగలుగుతారు.
నా! చక్ర రాజ రథారూఢ సర్వాయిధ పరిష్కృతా ! గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ! కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా ! జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా !!
తా: గేయ చక్రంలో ఉన్న మంత్రిణీతో, కిరిచక్రంలో ఉన్న దండనాథ మొదలైన అనేక చక్రాసీన శక్తి సమూహాల తో వెలిగే అగ్ని గుండం ( జ్వాలామాలిని అనే చతుర్దశి నాడు జాగృతమయ్యే యోగినీ శక్తి కలిగించిన మూలాధార అగ్ని తత్వం – ఇది వెలిగినప్పుడు శరీర తాపం దగ్దమవుతుంది – ఈస్థితిని అంతర్ముఖంగా దర్శించడానికే యజ్ఞ యాగాదులు బాహ్య రూపాలుగా ఉంచి ఆహుతి ( శరీర మానసిక ప్రవృత్తుల లయం ) కార్యక్రమాలు నిర్వర్తించారు. అగ్ని తన ఉష్ణ శక్తితో అరిషడ్వర్గ సమేత తమస్సును దగ్ధం చేస్తూ కాంతి శక్తితో జ్ఞానం వైపు దారి చూపుతుంది. ఆసైన్యం మధ్య నవకోన సమన్వితమై శతయోజన పర్యంతమై ఉన్న చక్రరాజమైన శ్రీ చక్రంలో ఆసీనురాలై యద్ద భూమిలో సన్నద్ధురాలుగా ఉన్నది. ఆంటే జాగృతమైన ఆ లలిత కౌమారి దశను దాటి తన శక్తులతో యుద్ధ సన్నద్ధురాలైంది. స్పందశాస్త్రం అస్తిత్వాన్ని శక్తిగా దాని క్రియగా రెండు స్థితులలో ఉంటుందనీ క్రియ నుండి బయటపడినప్పుడు కేవల శక్తిగా మారుతుందని అంటున్నది. ఈ కేవల శక్తిలో సాధకుడు తానే శక్తిగా, కాంతి గా మారి అగ్ని మధ్యలో నాశరహితుడై ఉంటున్నాడు అని చెప్తున్నది . వహ్ని ప్రాకారాలుగా 4 శివ కోణాలు, జ్వాలామాలిని అనే 5 శక్తి కోణాల మధ్య ఉన్న బిందు రూపమే ఆ పరాశక్తి. దేవి తన 5 శక్తులతో నాలుగు పదార్థ ప్రాకారాలను సృష్టి చేసింది. అదే ‘జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా’ అనే బిందువుగా ఉన్న సంకల్ప సంతులిత శ్రీ లలిత రూపం.
మొదటి సారిగా యోగి తన ఇచ్చానుసారంగా తన అరిషడ్వార్గాలను(అసురులతో యుద్ధానికి ) అంతర్గత చైతన్యంతో (శక్తులు – మంత్రిణీ అనే ఆలోచనా శక్తితో మంత్ర రహస్యాలను తెలిపి సిద్ధిని కలిగించేది, దండనాథ అనే యమ నియమ శక్తులతో శరీర పతనానికి లేక శక్తి ఉత్తానానికి కారణమైన యముడు )నియంత్రించడానికి నిరంతరం అలుపు లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రాణాయామం తో జాగృతమైన కుండలిని ని ఏకాగ్రతతో శరీరం తో అనుసంధానం చేస్తే అణిమాది అష్ట సిద్ధులు లభిస్తాయి. మంత్రం లోని నాదం ఉచ్ఛారణలో జీవ శక్తితో కలిసి మంత్ర వీర్యమై భావం అనుభవంగా కుండలిని జాగృతమౌతుంది. మంత్ర ఉచ్చారణ బీజమై, అంతర్గతమై నాదం కాంతిలో లయమై అర్థ భావ అనుభవాలను తీసుకొని కేవల చైతన్య శక్తిగా మిగులుతుంది. అందుకే సహస్రనామం విశ్వరూపం తెలుసుకోవడానికి, పంచదశీ మాలా మంత్రం త్రిపుటిని భేదించడానికి, ఈ కార బీజాక్షరం ఏక తత్వం కావడానికి ఉపయోగపడతాయి. దీన్నే బౌద్ధ ఆరాధకులైన చైనా, కొరియా, జపాన్ వంటి దేశాలలో షావోలిన్ గురుకులాల్లో శరీర మానసిక ఆధ్యాత్మిక స్థితులుగా సాధన చేశారు. జ్ఞాన సంతులిత సంకల్పం పెరుగుతూ క్రమేణా తన పూర్ణ స్వస్వరూప జ్ఞానం తెలుసుకొంటాడు. శ్రీ చక్ర ఆవరణలను యోగినీ శక్తులను దాటుతూ శుద్ధ శ్రీ లలిత రూపమైన లేక శుద్ధ విద్యగా పిలువబడుతున్న జ్ఞాన లక్ష్యమైన బిందువును ( ఆనందాన్ని, చిత్ ను దాటి సత్ స్వరూపమైన ఏక తత్వం ) చేరడమే సాధకుల లక్ష్యం. ఇదంతా శివ సూత్రాలపై క్షేమరాజు రాసిన వ్యాఖ్యలో విపులంగా ఉన్నాయి. ఈ బిందువు చేరిన వారి విశ్వరూప వివరణే ఈ లలితా సహస్రనామం. వేదాన్ని అవపోసన పట్టి వాటి మూలార్ధాన్ని వివరించిన వాటిలో అతి ముఖ్యమైన గ్రంధాలు లలితా సహస్ర నామం, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు, చండీ సప్తశతి వంటివి ఉన్నాయి. విశ్వ శక్తి విహారాన్ని, సృష్టి స్థితి క్రియలను, జీవ మానవ జనన మరణ చక్రాన్ని, ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులను, మానవ శరీరంలో శక్తి విహారాన్ని, ఆ మూల శక్తి స్వరూపమైన బిందువును, ఆ శక్తి చుట్టూ ఉన్న పదార్థ తత్వాలను ( శైవ, వైష్ణవ, శాక్తేయ ) దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి మార్గాన్ని ఉపదేశించిన గ్రంధాలివి. అందుకే పారాయణంతో ఆగకుండా అర్థ భావ సాధనా, అనుభవ సహితంగా ఆ స్థితి చేరుకోవడమే వీటి లక్ష్యం. శక్తి, బుద్ధి, ప్రాణ తత్వాల ఏకత్వ నిరంతర సంతులిత స్థితి అది. మూలాధారంలో మొదలై ( సుషుప్తి చైతన్యమై ) ఊర్ధ్వ ముఖమై (వివిధ శక్తి రూపాలలో జాగ్రత్ స్వప్న సుషుప్తులను దాటి తురీయంలో బిందువుగా స్థిరంగా శ్రీ లలితగా ఉండడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో ఎవరి స్ధాయిని వారు తెలుసుకొంటూ ఆయా సాధనలు చేసిన గురు సమక్షంలో ( జీవ గురువులు దారి చూపుతారు, దివ్య సిద్ధ జ్ఞాన గురువులు అదృశ్యంగా సూక్ష్మ స్థాయిలో ఉండి ఆయా స్థాయిలకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుస్తారు )తమ తరువాతి స్ధాయిని తెలుసుకొని పురోగమన పరిణామ ప్రయాణం సాగించాలి. ఈ పరిణామమే జనన మరణ చక్రాన్ని దాటించే జీవన లక్ష్యం. దీనికి బాహ్య శరీర మాయ నుండి బయటపడి అంతర్ముఖం కావాలి. శరీరాన్ని నియంత్రించడానికి యమ, నియమ, ఆసనాలు ఉపయోగపడతాయి. ప్రాణాధీన శరీరాన్ని బుద్ధిని అదుపులోనికి తెచ్చి జాగృతం చేయడానికి ఓషధీ, మంత్ర, ప్రాణాయామ సాధనలు ఉపయోగపడతాయి. బాహ్యప్రభావాల నుండి అంతర్ముఖం కావడానికి ప్రత్యాహారం. జాగృతం అయిన శక్తి స్థిరమై తన పూర్ణ సమతుల్య ఆవాసమైన సహస్రారం చేరడానికి కావలసిన ఏకాగ్రతను ధారణ ధ్యాన సమాధి స్థితులు తోడ్పడతాయి. శక్తి కేవల గా మారినప్పుడు కైవల్య సిద్ధి లభిస్తుంది. యోగ క్రియలన్నీ జీవిలో నిరంతరం అసంకల్పితంగా జరిగే సాధారణ ప్రక్రియలే కాని వాటిని సంకల్పాధీనం చేసి తిరోగమన పరిణామం నియంత్రించి ( పదార్ధం వైపు కాకుండా ) పురోగమన పరిణామ ( శక్తి తత్వం వైపు ) వేగం పెంచి తన మూల శాశ్వత సత్వ సంతులిత చైతన్య తత్వం చేరడమే యోగం. పతంజలి యోగసూత్రాలలో ” యోగ చిత్త వృద్ధి నిరోధః ” ఆంటే చిత్తం యొక్క వృత్తులను నిరోధించడమే యోగం అనీ, ” తీవ్ర సంవేగానాం ఆసన్న ” ఆంటే ఆ యోగ సిద్ధి తీవ్ర సాధనతోనే లక్ష్య సిద్ధి చేరుతుంది ఆని అన్నారు. అటువంటి సేనలతో ఉద్యుక్తురాలై యుద్ధానికి సన్నద్ధమైంది.
నా! భండసైన్య వధోద్యుక్త విక్రమ హర్షితా ! నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ! భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా !మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తొషితా ! విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితా!!
భండాసుర సైన్యాన్ని సంహరించడానికి ఉద్యుక్తమైన తన నుండి ఉత్పన్నమైన శక్తి సేనల పరాక్రమాన్ని చూసి ఆ లలిత హర్షించింది. కామేశ్వరి నుండి చిత్ర వరకు పౌర్ణమి నుండి అమావాస్య వరకు దినాలను శాసించే పదిహేను నిత్యా దేవతల ( వీటి జాగృతికి కావలసిన మంత్రాలను గూర్చి జ్ఞానార్ణవమ్, తంత్ర రాజం వివరించాయి) పరాక్రమ పటాటోపాన్ని ( దమనకుడు నుండి చిత్రగుప్తుడు వరకు శరీరాన్ని పక్ష దినాలతో శాసిస్తూ ఉన్న పదిహేను మంది భండాసుర శక్తులను ) యుద్ధానికై నిరీక్షిస్తున్న వారి ఉత్సాహాన్ని చూసి ఆ పరాశక్తి ముగ్ధురాలైంది. నిత్యా శక్తులు శాశ్వత తత్వమైన పరాశక్తి నుండి ఉదయించే దైవీయ శక్తులు. భండాసుర శక్తులు పదార్థంతో పుట్టి పదార్థంతో అంతరించి పోయేవి. భండ పుత్రులను ( బ్రహ్మాండ పురాణం ఆధారంగా చతుర్బాహు నుండి ఉపమయ అనే 30 మంది భండాసుర పుత్రులు )వధించడానికి సన్నద్ధమైన బాల విక్రమాన్ని లేక ఉద్యుక్తతను చూసి ఆ లలితా శక్తి ప్రమోదం ( నంద – ఆనంద ) చెందుతున్నది. మంత్రిణి లేక శ్యామల లేక మాతంగి శక్తి తన ఆలోచనతో విషంగాది ( భండాసురిని కుడి భుజమైన, శుక్రాచార్య సమాన మేధావి అయిన విశుక్రుడు, ఎడమ భుజం నుండి వచ్చిన విశుంగుడు అనే భండాసురుని సోదరులు) దైతులను సంహరించడానికి వ్యూహ రచన చేస్తున్నది. విశుక్రుని సంహరించడానికి ఉద్యుక్తమైన వారాహిని చూసి ఆనందాన్ని పొందుతున్నది.
భండాసురుడు ఆంటే ద్వయాత్మిక తత్వాన్ని ఆరాధించేవాడు లేక ఆ తత్వమైన వాడు. ఏక తత్వమైన పరాశక్తిని మరచిన శరీర తత్వం ఆని అర్థం. శక్తిని అడ్డగించే ఆ పదార్థానికి ఉన్న అరిషడ్వర్గ ప్రభావంతో తామస ప్రవృత్తి లోఉన్న ఊర్ధ్వ జ్ఞానేంద్రియ, అధోభాగాన ఉన్న కర్మేంద్రియ సమూహం, వాటి తో మందమైన శరీర ప్రవృత్తులు కలిపి భండాసురుడు అతని సైన్యం ఆని అర్థం. ఆ సైన్యాన్ని ఎదిరించడానికి ఏక తత్వ రూపమైన ఆ పరాశక్తి ఆమె ఇఛ్ఛా జ్ఞాన ధర్మ కర్మ క్రియలు శక్తులుగా జాగృతమైన కుండలిని నుంచి ఉదయించాయి. శక్తి సూత్రాలు చెప్పినట్లు ఆ లలిత నుండి వచ్చిన దివ్య శక్తుల ప్రభావం లో కలిగే ఆనంద అనుభూతిని ఏ మాత్రం జీవుడు కలిగి ఉన్నా ఈ భండాసురునికి లోబడి సంసార బంధం లేక కర్మ బంధం లేక పదార్థ ప్రభావం లేక మాయకు లోబడి ఉండడు.
బంధాలకు శరీర సంగానికి కారణమైన భండాసురుని వ్యతిరేక శక్తి ఆ సంగ వధకు లేక తీసివేయడానికి వారాహి గా ఉదయించి ఉత్సాహంతో ఉంది. శుక్ర లేక వీర్య లేక తేజస్సును పోకుండా కాపాడేది ‘విశుక్రప్రాణ హరణ’ ఆని శివ సూత్రాలు చెప్తున్నాయి. బాలా, మంత్రిణి, వారాహి శక్తులు శరీరం అనే భండాసురుణ్ణి నిస్తేజం చేసి నిర్మూలించడానికి బుద్ది ద్వారా జనియించిన శక్తిస్వరూపాలు. ఈ శక్తులు ప్రాణాన్ని శరీరం వైపు పోకుండా నియంత్రించి స్వస్వరూప స్వస్థతను చేకూరుస్తాయి. బాలా అనే చైతన్యం తన స్వస్వరూపాన్ని జాగృతం చేస్తుంది. దాన్ని పూర్తిగా తెలుసుకొని స్థిరం శాశ్వతం కావడానికి సుషుమ్నలో ఊర్ధ్వ ప్రయాణం చేసి సహస్రారం చేరాలి. అక్కడ ధారణ ధ్యానాన్ని ఉపయోగించి శాశ్వత స్థిర శక్తి తత్వమై నిలవాలి. అప్పుడు జీవం నుండి ఆత్మ విడివడి తన మూలమైన పరమాత్మ అవుతుంది. దీనికి జ్ఞాన సంపాదనను శరీరానికి ( అనవమలం ), మనస్సుకు ( మాయకమలం ), బుద్ధి ( కార్మికమలం ) కి కాకుండా దివ్య, ఆధ్యాత్మిక శక్తుల వైపు నడపాలి.